హైదరాబాద్ : రుతు పవనాలు చురుకుగా కదులుతుండడంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. విజయనగరంలో భారీ వర్షాలు, కోస్తాలో మోస్తరుగా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలోని భూపాలపల్లి, నిజామాబాద్, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. మిగిలిన చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రానున్న 24 గంటల్లో కోస్తాలో అనేక చోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, నదులకు వరద పోటు ఉంటుందని వివరించారు. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.