కిరణ్‌ బేడీ ఉద్వాసన వెనుక.…

కిరణ్‌ బేడీ ఉద్వాసన వెనుక.…

న్యూఢిల్లీ : పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి ఉత్తమ అధికారిగా పేరు ఉంది. కానీ ఆమె తనకు బీజేపీ పెద్దలు అప్పగించిన లక్ష్యాన్ని నెరవేర్చడంలో విఫలమయ్యారు. ముఖ్యమంత్రి వీ నారాయణ స్వామి చేసే తప్పులను ఎత్తి చూపాలని ఆమెకు ఆదేశాలు ఉండగా, ఆమె రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుని, నారాయణ స్వామికి ప్రజల్లో సానుభూతి పెరిగేలా చేశారని బీజేపీ పెద్దలు భావించినట్లు తెలుస్తోంది. లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి కిరణ్ బేడీని తప్పించాలని ముఖ్యమంత్రి వీ నారాయణ స్వామి దాదాపు ఐదేళ్ల నుంచి పోరాడుతున్నారు. నిరసన ప్రదర్శనలు, రాష్ట్రపతితో భేటీ వంటివి నిర్వహించారు. చివరికి ఆమెను ఈ పదవి నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించింది. అయితే దీని వెనుక కారణాలు వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది.
పుదుచ్చేరి శాసన సభకు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలను, వ్యూహాలను పక్కాగా అమలు చేసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ పదవిలో ఓ రాజకీయవేత్తను నియమించాలని బీజేపీ భావిస్తోంది. తగినంత మెజారిటీ రాకపోతే ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించే వ్యక్తిని ఎంపిక చేయాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.
రానున్న ఎన్నికల కోసం మాజీ ముఖ్యమంత్రి ఎన్ రంగ స్వామి నేతృత్వంలోని ఎన్ఆర్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే చర్చలకు ముందే కిరణ్ బేడీకి ఉద్వాసన పలకాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. దీంతో ఇది కూడా కిరణ్ బేడీ పదవి పోవడానికి ఒక కారణం అని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.
ఇదిలావుండగా, లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి కిరణ్ బేడీని తొలగిస్తూ, ఎన్నికల ముందు తీసుకున్న చర్య కేవలం బీజేపీ స్వీయ ప్రయోజనాల కోసమేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos