హైదరాబాద్ : నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారించాలని, సామాజిక మాధ్యమాలతో నిత్యం గడుపుతూ సమయాన్ని వృథా చేసుకోవద్దని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉద్బోధించారు. బంజారాహిల్స్లోని ముఫకంజా ఇంజనీరింగ్ కళాశాల స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. పుస్తక పఠనంతో విజ్ఞానాన్ని పెంచుకోవాలని, ఎక్కడున్నా మాతృభాషను, పట్టిన గడ్డను మరవద్దని సూచించారు. గొప్ప కలలు కనడంతో పాటు వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ రామచంద్రం పాల్గొన్నారు.