హొసూరు : పట్టణంలో లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు తొమ్మిది రోజుల్లో సుమారు 350 టన్నుల కూరగాయలను పంపిణీ చేసినట్లు మాజీ మంత్రి బాలకృష్ణా రెడ్డి తెలిపారు. కరోనా నిరోధక చర్యల్లో భాగంగా లో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా పట్టణంలోని వాణిజ్య సముదాయాలు, మార్కెట్లు మూతపడ్డాయి. పట్టణంలో ప్రజలు నిత్యావసర వస్తువులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు వివిధ రాజకీయ పార్టీలే కాక స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పేద ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నాయి. గత తొమ్మిది రోజులుగా మాజీ మంత్రి బాలకృష్ణారెడ్డి పట్టణంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలకు కూరగాయలను పంపిణీ చేశారు. 350 టన్నుల కూరగాయలను పంపిణీ చేసినట్లు ఏడిఎంకె పార్టీ నాయకులు తెలిపారు. నిరంతరాయంగా కొనసాగిన ఈ కార్యక్రమంలో పట్టణంలోని 45 వేల మందికి కూరగాయలు వితరణ చేసినట్లు చెప్పారు. సేలం, ఈరోడ్ లలోని అమ్మ క్యాంటీన్ లకు కూడా లారీలో కూరగాయలు పంపినట్లు ఏడిఎంకే పార్టీ నాయకులు ఈ సందర్భంగా తెలిపారు.