న్యూఢిల్లీ: వాయు తుఫాన్ దిశ మారిందని వాతావరణ శాఖ అధికార్లు గురువారం ఇక్కడ తెలిపారు. బుధవారం రాత్రి తుపాను దిశ మారిందన్నారు. సౌ రాష్ట్రం తీరం నుంచి వాయు తుఫాన్ దూరంగా వెళ్లిందని చెప్పారు. అయితే గుజరాత్ తీరం వెంట బలమైన ఈదురు గాలులు గంటకు 150కి.మీ. నుంచి 180 కి.మీ. వేగంతో వీస్తాయని వివరించారు. గుజరాత్లో మూడు లక్షల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీరం వెంట భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ముంబై, గుజరాత్లోని అన్ని సాగర తీరాలను మూసివేశారు. విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సరిహద్దు భద్రతా బలగాలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. 52 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్ని చేపట్టాయి. అనేక విమానాలు, రైళ్లను ప్రభుత్వం రద్దు చేసింది.