సుధీర్ బాబు తాజా చిత్రంగా రూపొందిన ‘వి‘ త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గురించి, ‘ఆలీతో సరదాగా‘ కార్యక్రమంలో సుధీర్ బాబు ప్రస్తావించాడు. “నేను ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘సమ్మోహనం‘ సినిమా చేస్తున్నప్పుడు, ఆయన నాకు ‘వి‘ కథ చెప్పారు. కథ చాలా కొత్తగా .. విభిన్నంగా అనిపించింది.’ఎవరితో చేయాలనుకుంటున్నారు?’ అని అడిగితే, పవన్ – మహేశ్ బాబులతో చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. నాతో చేస్తే బాగుండని అప్పుడే అనుకున్నాను. ఆ తరువాత కథానాయకుడిగా నానీని అనుకుంటున్నట్టు తెలిసింది. రెండో కథానాయకుడి పాత్ర నా దగ్గరికి వచ్చింది. నేను బలంగా కోరుకున్నాను కనుకనే, ఆ కథ నా దగ్గరికి వచ్చింది. ఈ సినిమా నాకు తప్పకుండా మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం వుంది” అని చెప్పాడు.