మోదీ పాలనా మహిమ…45 ఏళ్ల గరిష్టానికి నిరుద్యోగం

మోదీ పాలనా మహిమ…45 ఏళ్ల గరిష్టానికి నిరుద్యోగం

దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చింది. 2017-18లో నిరుద్యోగ రేటు 6.1 శాతమని నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ) తెలిపింది. గత 45 ఏళ్లలో ఇదే గరిష్టం కావడం గమనార్హం. నవంబర్ 2016లో ఎన్డీయే సర్కారు నోట్ల రద్దు చేశాక నిరుద్యోగ సమస్య పెరిగిందని తెలుస్తోంది. 1972-73 తర్వాత ఈ స్థాయిలో నిరుద్యోగ రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామీణ ప్రాంతాల (5.3 శాతం)తో పోలిస్తే.. పట్టణ ప్రాంతాల్లో (7.8 శాతం) నిరుద్యోగ సమస్య అధికంగా ఉందని రిపోర్ట్ వెల్లడించింది.  2004-05 నుంచి 2011-12 సంవత్సరాల మధ్య చదువుకున్న గ్రామీణ ప్రాంత మహిళల్లో నిరుద్యోగ శాతం 9.7-15.2 మధ్య ఉండగా.. 2017-18లో అది 17.3 శాతానికి పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది. గ్రామీణ పురుషుల్లో 2004-05 నుంచి 2011-12 మధ్య 3.5-4.4 శాతం మధ్యనున్న నిరుద్యోగ రేటు 2017-18లో 10.5 శాతానికి చేరుకుంది. భారత ఆర్థిక వ్యవస్థ ఏటా 7 శాతం చొప్పున అభివృద్ధి చెందుతోంది. కానీ ఉద్యోగాల కల్పనలో మాత్రం మనం వెనుకబడిపోయాం. లక్షలాది మంది యువత ఏటా ఉద్యోగాల్లో చేరుతుండగా.. ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. నిరుద్యోగ సమస్య పెరగడం ప్రధాని మోదీపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ అంశాన్ని ప్రచారాస్త్రంగా వాడుకోనుంది. నిరుద్యోగ సమస్య తీవ్రం కావడం పట్ల ప్రతిపక్ష కాంగ్రెస్ మండిపడింది. ‘కేవలం ఐదేళ్లలోనే ప్రధాని మోదీ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు, నిరుద్యోగ సమస్య 45 ఏళ్ల గరిష్టానికి చేరింది. దేశంలోని నిరుద్యోగ యువత ఉద్యోగాలెక్కడ అని నిలదీస్తున్నార’ని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos