విజయవాడ : గోదావరి మిగులు జలాల పంపకంలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ప్రతిపాదనలను అంగీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చారిత్రక తప్పిదం చేస్తున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్. తులసి రెడ్డి విమర్శించారు. ఇక్కడి ఆంధ్ర రత్న భవన్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం తగదన్నారు. ఆయన చేతిలో కీలు బొమ్మగా మారి ఆంధ్రప్రదేశ్ను శాశ్వతంగా ఎడారి చేస్తున్నారని విమర్శించారు. గోదావరి మిగులు జలాలపై కేసీఆర్ ప్రతిపాదనను అంగీకరించడం ఏమిటని ప్రశ్నించారు. ఆ జలాలు ఆంధ్రప్రదేశ్ సొత్తని అన్నారు. రాయలసీమకు నీళ్లు పేరుతో కేసీఆర్ దగా చేస్తున్నారని విమర్శించారు.