హొసూరు : పట్టణంలో రోడ్ల మరమ్మతుల పనులు అర్ధంతరంగా ఆగిపోవడంతో వాహన చోదకులు దుమ్ము, ధూళిని పీల్చుకుంటూ గమ్య స్థానాలకు చేరాల్సి వస్తోంది. బాగలూరు రోడ్డును విస్తరించడానికి నాలుగు నెలల కిందట పనులు ప్రారంభించారు. పనులు నత్త నడకలా సాగుతున్నాయి. రోడ్డుకు ఇరువైపులా తవ్వేయడంతో వాహనాల రాకపోకల సందర్భంగా దుమ్ము రేగి ఆ ప్రాంతంలో ప్రజలకు ఇబ్బందిగా మారింది. హొసూరు-రాయకోట రోడ్డులోని ఆర్వీ ప్రభుత్వ పాఠశాల వద్ద, హొసూరు రైల్వే స్టేషన్ నుంచి ఆర్సీ చర్చి వరకు రోడ్ల రోడ్లపై కంకర వేశారు. తారు వేయకపోవడంతో వాహనాల రాకపోకల వల్ల దుమ్ము రేగి ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. రద్దీగా ఉండే రోడ్లను తవ్వి సకాలంలో మరమ్మతులు పూర్తి చేయకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందని స్థానికులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు త్వరగా పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.