అమరావతి : రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో ఈ నెల జీతాలు, పింఛన్ల కోసం ఓవర్డ్రాఫ్టునకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఖజానాలో రూ.వంద కోట్లు మాత్రమే ఉంటే, ఈ నెల అవసరాలు తీరడానికి సుమారు రూ.5 వేల కోట్లు అవసరమవుతుందని అంచనా. రెండు రోజుల్లో ప్రభుత్వోద్యోగులకు జీతాలు, పింఛన్లు చెల్సించాల్సి ఉంది. సామాజిక పింఛన్ల కింద వికలాంగులు, వితంతువులకు చెల్లించాలి. సామాజిక పింఛన్లకు రూ.1,200 కోట్లు దాకా అవసరం. ఎన్నికలకు ముందు పసుపు-కుంకుమ, అన్నదాతా సుఖీభవ లాంటి పథకాలకు చెల్లింపులు జరపాల్సి రావడంతో ఈ ఆర్థిక సంవత్సరం ఓవర్డ్రాఫ్టుతోనే ప్రారంభమైంది. కొన్ని బ్యాంకుల నుంచి రుణాలు సేకరించాలని చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో బహిరంగ మార్కెట్ రుణ మొత్తాలను ఈ పథకాల కోసం వినియోగించారు. బడ్జెట్కు అనుగుణంగా ఖర్చులు పరిమితం చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని వినిపిస్తోంది.