పడవ ప్రమాదం తప్పింది

పడవ  ప్రమాదం తప్పింది

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నదిలో పెద్ద ప్రమాదం తప్పింది. పడవ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల నూరు మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ గంటన్నర పాటు గడిపారు. తూర్పు గోదావరి జిల్లాలోని సఖినేటి పల్లి నుంచి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం గ్రామానికి పడవలో సుమారు నూరు మంది గురువారం రాత్రి బయలు దేరారు. మార్గ మధ్యంలో డీజీల్ అయిపోవటంతో పడవ నదిలో ఆగిపోయింది. ఆ సమయంలో గాలులు బలంగా వీయడంతో పడవ సముద్రం వైపునకు మళ్లింది. నది మధ్యలో చేపల కోసం మత్స్యకారులు వేసిన వలలు, కర్రలు అడ్డుపడంతో పడవ అక్కడే నిలిచిపోయింది. భయపడిన ప్రయాణికులు తమ బంధువులకు సమాచారాన్ని చేరవేశారు. నాటు పడవల సహాయంతో స్థానికులు, జాలర్లు పడవ చెంతకు చేరుకొని ప్రయాణికుల్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఆ తర్వాత బోటులో డీజీల్ నింపడంతో ఆ బోటు కూడ ఒడ్డుకు చేరింది. ప్రతి ఎన్నికల సమయంలో రాజకీయపార్టీల నేతలు ఈ ప్రాంతంలో వంతెన ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చి కూడ వాటిని నెరవేర్చలేదని స్థానికులు గుర్తు చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos