టోకెన్లతో ఓటర్లకు టోపీ

టోకెన్లతో ఓటర్లకు టోపీ

కుంభకోణం: పట్టణంలోని దుకాణం యజమాని షేక్ మహమ్మద్ గురువారం కూడా ఎప్పటిలాగే వినియోగదార్ల కోసం నిరీక్షిస్తున్నాడు. ఇంతలో జనం తన దుకాణంవైపు పోటెత్తడం చూసి ఆశ్చర్యపోయాడు. అందరి చేతిలో తన దుకాణం పేరుతో ఉన్న టోకెన్లు ఉన్నాయి. తమకు రెండు వేల రూపాయలు విలువ చేసే సరకులు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేసేసరికి అవాక్కయ్యాడు. ఆ టోకెన్లు అన్నీ నకీలీ అని వారికి నచ్చజెప్పినా.. జనం ఇంకా వస్తుండటం వల్ల దుకాణాన్ని మూసేశాడు. ఓటుకు టోకెన్..’ఇదిగోండి.. ఈ టోకెన్లు తీసుకుని ఎన్నికలు ముగిశాక ఆ దుకాణానికి వెళ్లి రూ.2000 విలువ చేసే సరకులు ఉచితంగా పొందండి. ఈ ఎన్నికల్లో మీ ఓటు మాకే’ అని ఓ అభ్యర్థి చేసిన పని ఫలితమే ఈ హడావుడి. తర్వాత ‘ఆ టోకెన్లు అన్నీ నకిలీవి. వాటికి ఈ దుకాణానికి ఏం సంబంధం లేదు. ఎవరో ఇచ్చిన తప్పుడు హామీకి ఈ దుకాణం, నేను బాధ్యులం కాదు’ అని నోటీసు అంటించి వెళ్లిపోయాడు.ఇది ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు కొందరు చేపట్టిన చర్య అని దుకాణం యజమాని షేక్ మహమ్మద్ అన్నాడు. షేక్ మహమ్మద్ అన్నాడీఎంకే పార్టీ సభ్యుడు కావడం గమనార్హం.

తాజా సమాచారం