జమ్ము కశ్మీర్ విభజనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశంలోని పలు రాజకీయ పార్టీలు ఇప్పటికీ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి.మొదటి నుంచి బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి,తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి కశ్మీర్ అంశంపై బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.డీఎంకే మాజీ అధ్యక్షుడు కరుణానిధి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మమతా డీఎంకే అధికార దినపత్రిక మురసొలి ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో కరుణానిధి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.అనంతరం మాట్లాడుతూ..జమ్ముకశ్మీర్ కు వచ్చిన పరిస్థితి రేపు తమిళనాడుకు, పశ్చిమబెంగాల్ కు సైతం రావొచ్చన్నారు.ఏదైనా ఒక రాష్ట్రానికి సంబంధించి నిర్ణయం తీసుకునే ముందు అక్కడి ప్రజల మనోభవాలను తెలుసుకోవాలని కానీ జమ్ముకశ్మీర్ విషయంలో అలా జరగలేదన్నారు. జమ్మూ–కశ్మీర్ మాజీసీఎం ఫరూక్ అబ్దుల్లా కుమారుడి ఇంటికి వెళ్లలేకపోతున్నట్లు విలపించిన తీరును చూసి ఆవేదన కలిగిందన్నారు. డీఎంకే చీఫ్ స్టాలిన్ సైతం కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.సామాజికంగా విద్య, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించిన నేపథ్యంలో ఆర్థికపరిస్థితి ఆధారంగా రిజర్వేషన్లు తీసుకొచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..