కరోనా ధాటికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బ్యాంకుల ఈఎంఐలపై తీపికబురు అందించిన కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లుల విషయంలోనూ అదే పద్ధతి అనుసరించడానికి నిర్ణయించుకున్నట్లు తెలస్తోంది.లాక్డౌన్ కారణంగా జనం ఇళ్లకే పరిమితం కావడం, ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ బిల్లుల చెల్లింపును మూడు నెలలు వాయిదా వేయాలని భావిస్తోంది.ముఖ్యంగా ఎటువంటి జరిమానా విధించకుండా, విద్యుత్ నిలిపివేత సమస్య లేకుండా మూడు నెలల తర్వాత బిల్లులు చెల్లించే అవకాశం కల్పించనున్నారు. ఇందుకు సంబంధించి గడచిన రెండు రోజుల నుంచి కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ విద్యుత్ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. త్వరలోనే అన్ని రాష్ట్రాల రెగ్యులేటరీలకు కేంద్ర విద్యుత్ రెగ్యులేటరీ సంస్థ దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.