కొత్తగా రూపొందించిన పురపాలక చట్టం-2019 బిల్లు ఆమోదానికి సంబంధించి తెలంగాణ శాసనసభ రెండు రోజుల ప్రత్యేక సమావేవాలు గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఇవాళ జరిగిన సమావేశాల్లో పంచాయతీరాజ్ సవరణ బిల్లును ఆమోదించారు. బోధనా వైద్యుల వయోపరిమితి పెంపునకు సంబంధించిన బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టగా.. దీనికి సభ మద్దతు ప్రకటించింది. రుణ విమోచన కమిషన్ ఛైర్మన్ నియామక బిల్లుకు కూడా శాసనసభ ఆమోదం తెలిపింది. పురపాలికల్లో వార్డుల సంఖ్యను ఖరారు చేస్తూ గతంలో జారీచేసిన ఆర్డినెన్స్ స్థానంలో తీసుకు వచ్చిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సమావేశాలు ప్రారంభం కాగానే సీఎం కేసీఆర్ కొత్త మునిసిపల్ చట్టాన్ని ప్రవేశపెట్టగా సభ్యుల అధ్యయనానికి ఒక్కరోజు సమయమిచ్చిన సభాపతి సభను శుక్రవాయం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.శుక్రవారం చర్చకు రానున్న కొత్త మునిసిపల్ చట్టంపై సీఎం కేసీఆర్ సమాధానమిస్తారు. అదేరోజు బిల్లుకు ఆమోదం లభించగానే స్పీకర్ నిరవధికంగా అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేస్తారు. అసెంబ్లీలో ఆమోదించిన మున్సిపల్ బిల్లును శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం చంద్రశేఖర్ రావు శాసనసభ మండలిలో ప్రవేశపెడుతారు. ఆ వెంటనే చర్చించి మండలి ఆమోదం తీసుకుంటారు. మున్సిపల్ బిల్లుకు ఆమోదముద్ర పడిన అనంతరం డిప్యూటీ చైర్మన్ మండలి సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తారు. అసెంబ్లీ, మండలి సమావేశాల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.కాగా గురువారం ఉదయం సమావేశాలను ప్రారంభించిన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రి జగదీశ్రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు..