ఢిల్లీ : శాసన సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న తెదేపాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్లు గురువారం భాజపాలో చేరారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో భాజపా కార్య నిర్వాహక అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా వారికి పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాల నాయకత్వం నచ్చి తెదేపా నాయకులు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. వీరి చేరికతో ఆంధ్రప్రదేశ్లో భాజపా బలం పుంజుకుంటుందని ఆశిస్తున్నామని చెప్పారు. అంతకు ముందు రాజ్యసభలో తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశమై కీలక తీర్మానం చేసింది. రాజ్యసభలో తెదేపా పార్లమెంటరీ పార్టీని తక్షణమే భాజపాలో విలీనం చేయాలని తెదేపా ఎంపీలు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడును కోరారు. తమను ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలని కోరారు. కాసేపటికే వారు తాము భాజపాలో చేరుతున్నట్లు ప్రకటించారు.