అసలే ఓటమి భారంతో నైరాశ్యంలో కూరుకుపోయిన తెదేపాకు విజయవాడకు చెందిన ఇద్దరు సీనియర్ నేతల ప్రవర్తనతో మరింత నష్టం వాటిల్లింది.విజయవాడ ఎంపీ కేశినేని నాని,ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నల మధ్య కొద్ది రోజులుగా ట్విట్టర్ వేదికగా జరుగుతున్న మాటల యుద్ధం తెదేపా అధినేత చంద్రబాబుకు మరో కొత్త తలనొప్పిగా మారింది.రెండు రోజుల నుంచి వీరిద్దరి మధ్య ట్వీట్ల వార్ తారాస్థాయికి చేరగా.. సోమవారం ఉదయం నాని ఘాటుగా స్పందించారు. మీ పెంపుడు కుక్కలను కంట్రోల్ చేయండి.. లేదంటే పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కేశినేని నేరుగా చంద్రబాబుకే గురిపెట్టి ట్వీట్ చేశారు.దీంతో బలహీన వర్గాలకు చెందిన నాకు ఎమ్మెల్సీ పదవినిచ్చిన చంద్రబాబుకు తాను విశ్వాసపాత్రుడిననని.. దానికి నువ్వు ఏ పేరు పెట్టినా తనకు సమ్మతమేనని.. చంద్రబాబు కోసం, టీడీపీ కోసం ఈ ట్వీట్ల యుద్ధాన్ని ఆపేస్తున్నట్లు వెంకన్న ప్రకటించారు.కాగా నాని,బుద్దాల మధ్య మాటల యుద్ధానికి విజయవాడ పశ్చిమ శాసనసభ స్థానానికి అభ్యర్థుల ఎంపికే ప్రధాన కారణమని తెదేపా కార్యకర్తలు భావిస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో విజయవాడలోని పశ్చిమ అసెంబ్లీ స్థానంలో పోటీ విషయమై నేతల మధ్య విభేదాలకు కారణంగా తెలుస్తోంది. విజయవాడలోని పశ్చిమ అసెంబ్లీ స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో నాగుల్ మీరా పోటీ చేస్తారని విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రకటించారు. చంద్రబాబుకు సంబంధం లేకుండా ఈ విషయాన్ని నాని ప్రకటించడంపై ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అసంతృప్తితో ఉన్నారు.వచ్చే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రయత్నాలు చేసుకొంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈ స్థానం నుండి మాజీ ఎమ్మెల్యే జలీల్ఖాన్ కూతురు పోటీ చేసి ఓటమి పాలైంది. ఈ స్థానం నుండి పోటీ చేసేందుకు నాగుల్ మీరా ప్రయత్నించాడు. జలీల్ ఖాన్ కూతురుకు టిక్కెట్టు కేటాయించాలని నిర్ణయం తీసుకోవడంపై నాగుల్ మీరా అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ విషయమై నాగుల్ మీరాను కేశినేని నాని చంద్రబాబునాయుడు వద్దకు తీసుకెళ్లారు.చంద్రబాబుతో సమావేశం తర్వాత నాగుల్ మీరా మెత్తబడ్డారు. అయితే ఇటీవల జరిగిన ఓ సమావేశంలో పశ్చిమ అసెంబ్లీ స్థానం నుండి నాగుల్ మీరా పోటీ చేస్తారని కేశినేని నాని ప్రకటించడం బుద్దా వెంకన్నకు అసంతృప్తిని కల్గించినట్టుగా చెబుతున్నారు.టీడీపీ కార్పోరేటర్లతో కేశినేని నాని సమావేశం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బుద్దా వెంకన్నకు మంటలు పుట్టించాయి. విజయవాడ తూర్పు స్థానంలో విజయం సాధిస్తే, విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానంలో 25 ఓట్లతో టీడీపీ ఓటమి పాలైంది. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ స్థానంలో వచ్చే ఎన్నికల్లో నాగుల్ మీరా పోటీ చేస్తారని నాని ప్రకటించారు.నాని చేసిన ఈ ప్రకటనపై అసహనం వ్యక్తం చేసిన బుద్దా వెంకన్న నాని అనుచరుల వద్దే నిరసన వ్యక్తం చేశారు. విషయం నానికి చేరడంతో అప్పటి నుంచి నాని,బుద్దా వెంకన్న మధ్య మాటల యుద్ధం జరుగుతోందని తెలుస్తోంది. ట్విట్టర్ వేదికగా ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకొంటున్న నేపథ్యంలో కేశినేని నాని, బుద్దా వెంకన్నలకు టీడీపీ నాయకత్వం నుండి ఫోన్లు వచ్చాయి. ఈ ఇద్దరు నేతలు చంద్రబాబుతో సమావేశం అయ్యే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలోనే బుద్దా వెంకన్న ట్వీట్ల యుద్ధాన్ని ఆపేస్తున్నట్లు ప్రకటించారనే వార్తలు వినిపిస్తున్నాయి..
బలహీన వర్గాలకి చెందిన నాకు ఎం ఎల్ సి పదవి ఇచ్చిన చంద్రబాబు గారికీ విశ్వాస పాత్రుడిని దానికి నువ్వు ఏ పేరు పెట్టినా నాకు ఇష్టమే …చంద్రబాబు గారీ కొసం పార్టీ కోసం ఈ ట్వీట్ల యుద్దం ఆపేస్తున్నాను
— venkanna_budda (@BuddaVenkanna) July 15, 2019