మద్యం మత్తులో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కుమారుడు అప్పలనాయుడు విశాఖ బీచ్ రోడ్డులో తన వాహనంతో యాక్సిడెంట్ చేశారు. ఘటనను చూసిన స్థానికులు అప్పలనాయుడు మద్యం తాగి ఉన్నాడని గమనించి దేహశుద్ధి చేయగా తన అనుచరుల సాయంతో అప్పలనాయుడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయినట్టు తెలుస్తోంది. ర్యాష్ డ్రైవింగే ప్రమాదానికి కారణమని, అదుపుతప్పిన అప్పలనాయుడు కారు ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టగా యువకుడికి గాయాలు అయ్యాయని అతన్ని ఆసుపత్రికి తరలించామని స్థానికులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, ప్రమాదానికి గురైన కారును స్టేషన్ కు తరలించే ఏర్పాట్లలో ఉన్నారు. ఈ కారు అదుపుతప్పి డివైడర్ పైకి ఎక్కి దానిపై ఏర్పాటు చేసివున్న పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని తాకిందని ఈ విషయంలో కేసు నమోదు చేశామని విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.అప్పలనాయుడి ఆచూకీ కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.ఈ కేసులో అదే కారులో ప్రయాణిస్తున్న పోలీసు అధికారి కుమారుడు మౌర్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని సాధ్యమైనంత త్వరలో అప్పలనాయుడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు.