ఢిల్లీ : యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన సర్జికల్ దాడుల వివరాలు కానీ, ఆధారాలు కానీ తమ వద్ద లేవని రక్షణ శాఖ తెలిపింది. 2004-2014 మధ్య జరిగిన సర్జికల్ దాడుల వివరాలు కావాలని జమ్ముకు చెందిన రోహిత్ చౌదరి సమాచార హక్కు చట్టం కింద కోరారు. దీనిపై అధికారులు ఆ కాలంలో సర్జికల్ దాడులకు సంబంధించి తమ వద్ద ఆధారాలు లేవని తెలిపారు. 2016 సెప్టెంబరు 29న జరిగిన దాడుల వివరాలు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. సర్జికల్ దాడులను బీజేపీ ఎన్నికల్లో ప్రధానాంశంగా చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్పై విమర్శలు కూడా చేసింది. తమ హయాంలో ఆరు సార్లు సర్జికల్ దాడులు జరిగాయని, ఓట్ల కోసం వాటిని ప్రస్తావించదలచుకోలేదని కాంగ్రెస్ బదులిచ్చింది.