హైదరాబాద్ : తెదేపా నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఇల్లు, కార్యాలయాల్లో సీబీఐ శనివారం సోదాలు నిర్వహించింది. హైదరాబాద్లోని ఆయన నివాసంతో పాటు రెండు కార్యాలయాల్లో బెంగళూరు సీబీఐ అధికారులు సోదాలు చేశారు. ఉదయం నుంచి ఏక కాలంలో మూడు చోట్ల ఈ తనిఖీలను నిర్వహించారు. గతంలో నమోదైన కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాల కోసం ఈ సోదాలు చేశారు. కొన్ని కీలక పత్రాలు, హార్డ్ డిస్క్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పంజాగుట్ట నాగార్జున సర్కిల్లోని కార్యాలయంలో సోదాలు జరిగాయి. బ్యాంకింగ్ ఫ్రాడ్ సెల్ బృందం సభ్యులు కూడా సోదాలు నిర్వహించారు. బెస్ట్ అండ్ కాంప్టన్ పేరిట సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు కుమారుడితో కలసి సుజనా వ్యాపారం చేశారు. కంపెనీ పేరిట అక్రమంగా రుణాలు తీసుకోవడంతో గతంలోనే ఈడీతో పాటు సీబీఐ కూడా కేసులు నమోదు చేసింది.