‘స్టెర్లింగ్’ వంచన రూ. 14 వేల కోట్ల

‘స్టెర్లింగ్’ వంచన  రూ. 14 వేల కోట్ల

న్యూ ఢిల్లీ: గుజరాత్కు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ యజమానులు-సందేసరా సోదరులు పలు బ్యాంకులకు రూ. 14 వేల కోట్లకు పైగా వంచించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా వెల్లడించింది. స్టెర్లింగ్ సంస్థ, దాని యజమానులు నితిన్ సందేసరా, చేతన్ సందేసరా, దీప్తి సందేసరా రూ. 5,393కోట్ల బ్యాంకు రుణాల మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దరిమిలా 2017లో వీరికి వ్యతిరేకంగా ఈడీ, సీబీఐ కేసులు దాఖలు చేసాయి. భారత్లోని బ్యాంకుల నుంచే కాకుండా విదేశాల్లోని భారతీయ బ్యాంకుల శాఖల నుంచి కూడా సందేసరా గ్రూప్ దాదాపు రూ. 9000 కోట్ల రుణాలు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలిందట. ఆంధ్రా బ్యాంక్, యూకో బ్యాంక్, ఎస్బీఐ, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆంఫ్ ఇండియా తదితర బ్యాంకుల కన్సోర్షియం నుంచి దేశీయ, విదేశీ కరెన్సీల్లో స్టెర్లింగ్ సంస్థ రుణాలు తీసుకున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. తప్పుడు పత్రాలతో పొందిన రుణాల్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని దర్యాప్తులో తేలిందట. స్టెర్లింగ్ బయోటెక్ కేసులో ఇటీవల ఈడీ రూ. 9,778 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఇందులో నైజీరియాలోని నాలుగు చమురు రిగ్గులు, ఓఎంఎల్ 143 అనే చమురుక్షేత్రం, తుల్జాభవాని, వరింద, భవ్య, బ్రహ్మణిఈటీసీ అనే పేర్లతో పనామాలో రిజిస్టరైన నాలుగు నౌకలు, సైబ్ఎల్ఎల్సీ పేరుతో అమెరికాలో రిజిస్టరైన ఓ విమానం, లండన్లోని విలాసవంతమైన ఫ్లాట్ ఉన్నాయి. ఈడీ చేసిన అతిపెద్ద ఆస్తుల జప్తు ఆదేశాల్లో ఇదొకటని అధికారులు తెలిపారు. ఇందులో ఎక్కువ భాగం విదేశాల్లోని ఆస్తులే ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos