చెన్నై : దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనం, జీడీపీ క్షీణతపై డీఎంకే ఆందోళన వ్యక్తం చేసింది. జీడీపీ అయిదు శాతానికి పడిపోవడంపై కేంద్రంలోని ఎన్డీఏ సర్కారును దుయ్యబట్టింది. గత 27 ఏళ్లలో ఇంతటి బలహీనమైన జీడీపీ వృద్ధి రేటును చూడలేదని పార్టీ అధ్యక్షుడు ఎంకే. స్టాలిన్ విమర్శించారు. దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు, కాంగ్రెస్ నాయకుడు పీ. చిదంబరం అరెస్టు లాంటి అంశాలను ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. ఆర్థిక మందగమనంపై మీడియాలో వార్తలు రాకుండా తొక్కిపెట్టినప్పటికీ, సోషల్ మీడియాలో విరివిగా వార్తలు వస్తున్నాయని తెలిపారు. తమిళనాడులో ముఖ్యమంత్రి, మంత్రుల విదేశ పర్యటనలపై వ్యాఖ్యానిస్తూ, ఇదో టూరింగ్ కేబినెట్ అని ఎద్దేవా చేశారు.