శ్రీశైలం : కృష్ణా నదికి వరద పోటు ఎక్కువవుతుండడంతో శ్రీశైలం జలాశయం నాలుగు గేట్లను ఎత్తివేసి నాగార్జున సాగర్కు లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంది. నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గేట్లను ఎత్తారు. అంతకుముందు ఆయనతో పాటు తెలంగాణ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్లు కృష్ణమ్మకు పూజలు నిర్వహించారు. ఎగువన భారీ వర్షాలు పడుతుండడంతో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంటోంది. మరో అయిదు అడుగులు నిండితే గరిష్ట మట్టం 885 అడుగులకు చేరుకుంటుంది. జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 190 టీఎంసీల నిల్వ ఉంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి ముందుగానే జలాశయం గరిష్ట మట్టానికి చేరువైంది.