ముగిసిన షిర్డీ వివాదం

ముగిసిన షిర్డీ వివాదం

ముంబై : షిర్డీ సాయిబాబా జన్మస్థలం ఏదనే విషయంలో తలెత్తిన వివాదంపై శివసేన వెనక్కి తగ్గింది. ఇక ముందు బాబా జన్మస్థలంగా పత్రిని పేర్కొనేది లేదని, కొత్త వివాదం సృష్టించే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని ఆ పార్టీ నాయకుడు కమలాకర్ కోతే తెలిపారు. షిర్డీ ట్రస్టు ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సోమవారంనాడు సమావేశమయ్యారు. ఈ సమావేశానంతరం కమలాకర్ కోతే మీడియాతో మాట్లాడుతూ, షిర్డీ సాయిబాబా జన్మస్థలంగా పత్రిని ఇక ముందు పేర్కొనరాదని సమావేశం నిర్ణయించినట్టు చెప్పారు.

సాయిబాబా జన్మస్థలమైన పత్రి గ్రామాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తామని శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఇటీవల ప్రకటించడం వివాదానికి దారితీసింది. బాబా జన్మస్థలంగా పత్రిని ప్రకటించి, అభివృద్ధి చేస్తే షిర్డీ ప్రాశస్త్యం తగ్గిపోతుందని షిర్డీ గ్రామ ప్రజలతో పాటు, పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. షిర్డీ నిరవధిక బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. శివసేనకు చెందిన స్థానిక నాయకులు కూడా షిర్డీవాసుల బంద్‌కు మద్దతుగా నిలిచారు. తొలుత తాము షిర్డీ భక్తులమని, ఆ తర్వాతే చట్ట సభలకు ఎన్నికయ్యామని వారిని శాంతింప చేసే ప్రయత్నాలు చేశారు. అయితే పత్రిని బాబా జన్మ స్థలంగా ప్రకటిస్తూ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం వెనక్కి తీసుకోనుంత వరకూ తాము వెనక్కి తగ్గేది లేదని షిర్డీవాసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆలయ ట్రస్టు ప్రతినిధులతో ఉద్ధవ్ థాకరే భేటీ కావడంతో పరిస్థితి సద్దుమణిగేందుకు మార్గం సుగగమైంది.

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos