హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అనుసరించిన తీరుపై మాజీ మంత్రి షబ్బీర్ అలీ మండిపడ్డారు. స్పీకర్ పదవి పట్ల తమకు గౌరవం ఉందంటూనే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకోవడంలో ఆయన రాజ్యాంగబద్ధంగా వ్యవహరించలేదని విమర్శించారు. కాంగ్రెస్కు అందుబాటులోకి రాని స్పీకర్, పార్టీని వీడిన 12 మంది ఎమ్మెల్యేలను ఎలా కలిశారని ప్రశ్నించారు. నిబంధనలను తుంగలో తొక్కి సీఎల్పీని తెరాసలో విలీనం చేశారని దుయ్యబట్టారు. తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలతో మార్చి నుంచే చర్చలు జరుపుతున్నారని, అప్పుడే తాము హైకోర్టులో పిటిషన్ కూడా వేశామని తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారని ఆయన విమర్శించారు.