అమరావతి: కాల్మనీ సెక్స్ రాకెట్ కేసుల్ని చాలా గంభీరంగా పరిగణించి రాజకీయ పక్షాలకు అతీతంగా నేరగాళ్లకు వ్యతిరేకంగా కఠినచర్యల్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి సూచించారు. మంగళ వారం ఇక్కడ జరిగిన పోలీసు ఉన్నతాధికార్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్ చోటు చేసుకోవడం దారుణం. ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో గంజాయి ఉత్పత్తిని అరికట్టేందుకు ఆగష్టు మాసంలో భారీ కార్యచరణ చేపట్టాలి’అని ఆదేశించారు. గంజాయిని సాగు చేస్తున్న గిరిజనులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా కాఫీ సాగుకు ప్రోత్సహించాలని సూచించారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. అక్టోబర్ 1వ తేదీ నాటికి రాష్ట్రంలో బెల్ట్ షాపులను ఎత్తివేయాలని ఆదేశించారు. జాతీయ రహదారుల వెంట మద్యం అమ్మకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.