మౌంట్ మాంగనుయ్: న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా అద్భుత ప్రదర్శన సాగిస్తోంది. అటు పురుషులు.. ఇటు మహిళలు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ కివీస్ను చిత్తుగా ఓడిస్తున్నారు. సోమవారం జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ను మట్టికరిపించి కోహ్లీసేన వన్డే సిరీస్ను సొంతం చేసుకోగా.. నేడు మిథాలీ సేన కూడా కివీస్ జట్టుపై వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ అమ్మాయిల మధ్య మంగళవారం రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న మిథాలీ సేన అద్భుతమైన బౌలింగ్తో కివీస్ జట్టును 161 పరుగులకు ఆలౌట్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత జట్టు.. ఆరంభంలో కాస్త తడబడింది. తొలి ఐదు ఓవర్లలోనే ఒపెనర్ జెమిమా రోడ్రిగ్స్(0), దీప్తి శర్మ(8) ఔటయ్యారు. అయితే ఆ తర్వాత కెప్టెన్ మిథాలీ రాజ్, ఓపెనర్ స్మృతి మంధాన క్రీజులో కుదురుకుని కివీస్ బౌలర్లను ఆటాడుకున్నారు. ఈ వన్డేలో స్మృతి(90), మిథాలీ(63) కలిసి 151 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు విజయాన్ని అందించారు. రెండో వన్డేలో భారత్ 35.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 166 పరుగులు సాధించింది. అటు తొలి వన్డేలోనూ భారత్ గెలుపొందడంతో మరో వన్డే మిగిలి ఉండగానే భారత జట్టు సిరీస్ను సొంతం చేసుకుంది.