విజయవాడ:జనసేన ప్రస్తుతానికి భవిష్యత్తు లేని రాజకీయ పక్షంగా ఉందని ఆ పార్టీ శాసనసభ్యుడు రాపాక వర ప్రసాద్ శని వారం ఇక్కడ వ్యాఖ్యానించారు. పార్టీ నాయకత్వం నుంచి తనకు సంజాయిషీ పత్రం అందినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టి పారేసారు. ‘నేను జనసేనలోనే ఉన్నా. కింది నుంచి జిల్లా స్థాయి వరకు శ్రేణుల్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. సమస్యలకు శ్రేణులు స్పందించేలా బాధ్యతను అప్పగించాలని చెప్పారు. అన్ని సమస్యలకు జనసేనాధిపతి పవన్ కల్యాణ్ మాత్రమే హాజరవుతుంటే పార్టీ బలోపేతం కాదు. ముఖ్యమంత్రి కావాలనే బలమైన సంకల్పం పవన్ లో ఉండాలి. అప్పుడే పార్టీ ముందుకు సాగుతుంది. ప్రతి దానికి అధినేతే వచ్చి ఆందోళన చేయడం సరికాద’ని కుండబద్ధలు కొట్టారు. ‘పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలంతా తాము పార్టీని వీడటానికి నాదెండ్ల మనోహరే కారణమని చెబుతున్నారు. పార్టీకి సంబంధించిన అన్ని అంశా లపై పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇద్దరే సంప్రదించుకుంటారు. వ్యక్తిగతంగా నాదెండ్లతో నాకు ఇబ్బంది లేదు. శాసన సభ సమావేశాల వల్లే నేను పవన్ దీక్షకు హాజరు కాలేదు. ప్రభుత్వం మంచి కార్యక్రమాలను చేపడితే నేను ప్రశంసి స్తాను. పార్టీ మారాలనుకోవటం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మారడం సర్వసాధారణమే. గతంలో నేతలకు రాజకీయ విలువలు ఉండేవి. పార్టీ మారే నేతలను ప్రజలు కూడా వ్యతిరేకించేవారు. ఇప్పుడు నేతలకు నిజాయతీ లేదు. నేతలు పార్టీలు మారినా ప్రజలూ పట్టించుకోవడం లేద’ని వ్యాఖ్యానించారు.