చెన్నై:సనాతన ధర్మం పై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల్ని ప్రముఖ నటుడు సత్యరాజ్ సమర్థించారు. ‘సనాతన ధర్మంపై ఉదయనిధి స్పష్టంగా మాట్లాడారు. ఇంత ధైర్యంగా తన అభిప్రాయాలను వెల్లడించినందుకు అభినందిస్తున్నాను. ఓ మంత్రిగా ఉదయనిధి కార్యచరణ, వ్యవహార శైలి పట్ల గర్విస్తున్నాను’ అన్నారు. ‘సనాతన ధర్మం’ డెంగీ, మలేరియా లాంటిదని, దాన్ని నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. మంత్రి వ్యాఖ్యలపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఉదయనిధి మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని.. ఈ విషయంలో క్షమాపణలు చెప్పేదే లేదని తెగేసి చెప్పారు.