ఔరా..! తంగిరాలను మరిచిన సైరా టీమ్

హైదరాబాద్ : చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం ద్వారా ఓ ప్రొఫెసర్‌కు అన్యాయం జరిగిందనే మాటలు వినిపిస్తున్నాయి. ‘తెలుగు వీరగాథలు’ అనే అంశంపై పరిశోధనలు చేసి పీహెచ్‌డీ పట్టా పొందిన ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావుకు ‘సైరా’ చిత్ర యూనిట్ అన్యాయం చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తంగిరాల మిత్రుడు, పద్యకళా పరిషత్తు అధ్యక్షుడు ఎం. రామచంద్రప్రసాద్ పేరిట రాసిన ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి మొదట పరిశోధన చేసిన వ్యక్తి తంగిరాల వెంకట సుబ్బారావు అని, ఆయన ‘తెలుగు వీరగాథలు’ అనే అంశంపై పరిశోధనలు చేసి పీహెచ్‌డీ పట్టా పొందారని తెలిపారు. తంగిరాల 1965 డిసెంబర్ నుంచి 1966 ఏప్రిల్ వరకు రేనాటి సీమ(కడప, కర్నూలు)లో పర్యటించి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సంబంధించిన అనేక విషయాలు, జానపద గేయాలు, వీరగాథలు సేకరించారని వెల్లడించారు. 1969 జూన్ నెల భారతిలో ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ అనే వ్యాసాన్ని తంగిరాల ప్రచురించారని గుర్తు చేసుకున్నారు. దీంతో ఉయ్యాలవాడ గురించి అందరికీ తెలిసిందని, ఆచార్య తంగిరాల మరిన్ని పరిశోధనలు జరిపి, 1999లో ‘రేనాటి సూర్యచంద్రులు’ అనే బృహద్గ్రంథాన్ని ప్రచురించారని చెప్పారు. ఇందులో నరసింహారెడ్డికి సంబంధించిన ఎన్నోవిషయాలు ఉన్నాయని తెలిపారు. 2017లో సైరా దర్శకుడి అసిస్టెంట్ రామ్మోహనరావు, పరుచూరి బ్రదర్స్ అసిస్టెంట్ బాలాజీ (దాము) ఆచార్య తంగిరాలను సంప్రదించి ‘రేనాటి సూర్యచంద్రులు’ పుస్తకాన్ని, ఒక్కొక్కరు ఒక్కో కాపీ తీసుకొని వెళ్లారని తెలిపారు. సినిమా తీస్తున్నారా అని తంగిరాల ప్రశ్నిస్తే.. లేదు, సీరియల్ తీస్తున్నామని ఒకరు, పరిశోధన చేస్తున్నామని మరొకరు అబద్ధం చెప్పారని.. తరువాత పత్రికలలో చూస్తే చిరంజీవి గారు సినిమా తీస్తున్నారని, భారీ బడ్జెట్ అని తెలిసిందని చెప్పారు. తంగిరాల వారి పేరు ఎక్కడా చెప్పలేదని, మూడు వందల కోట్ల రూపాయలతో సినిమా తీసి, దాని గురించి పరిశోధన చేసిన తంగిరాలకు మూడు రూపాయల విలువ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ‘సైరా’ అనే టైటిల్ కూడా తంగిరాల సేకరించిన పిచ్చుకుంట్ల పాటలో నుంచి తీసుకున్నారని, సినిమా వాళ్ల మహా మాయల్లో దీనిని మించిన మాయ మరొకటి లేదని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రామచంద్ర ప్రసాద్ అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos