లాడర్హిల్ : వికెట్ తీసినప్పుడు అతిగా సంబరాలు చేసుకున్నాడనే ఆరోపణపై పేస్ బౌలర్ నవదీప్ సైనిపై ఐసీసీ చర్యలు చేపట్టింది. వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20లో నికోలస్ పూరన్ ఔటైనప్పుడు సైని స్పందన అతిగా ఉన్నట్లు అంపైర్లు గుర్తించారు. దీంతో అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ వేశారు. ఆటగాళ్ల నిబంధన 2.5ను సైని అల్లంఘించినట్లు గుర్తించామని, బ్యాట్స్మన్ ఔటైనప్పుడు అతడు దూకుడుగా సంజ్ఞలు చేస్తూ అతిగా సంబరాలు చేసుకున్నాడని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. అతడి ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ను జమ చేసినట్లు కూడా పేర్కొంది. ఫీల్డ్ అంపైర్లు నిగెల్ డుగిడ్, జార్జ్ బ్రాత్వైట్, మూడో అంపైర్ లెస్లీ రీఫర్, నాలుగో అంపైర్ ప్యాట్రిక్ గస్టర్డ్లు, సైనిపై అభియోగాలు నమోదు చేశారు. రిఫరీ జెఫ్ క్రో ముందు పొరపాటు అంగీకరించడంతో అతడికి డీమెరిట్ పాయింట్ విధించారు.