చెన్నై: తనపై ఇప్పటివరకు వచ్చిన వదంతులు నిజమైనందుకు చాలా సంతోషంగా ఉందని అంటున్నారు ప్రముఖ తమిళ నటి శ్రద్ధా శ్రీనాథ్. అజిత్ ప్రధాన పాత్రలో బాలీవుడ్లో విజయం అందుకున్న ‘పింక్’ సినిమా రీమేక్ కాబోతోంది. ఇందులో శ్రద్ధ కీలక పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నట్లు చాలా కాలంగా వార్తలు వెలువడుతున్నాయి. మొత్తానికి ఆ రూమర్లు నిజమయ్యాయి. ‘పింక్’ తమిళ రీమేక్లో శ్రద్ధ.. తాప్సి పాత్రలో నటించనున్నారు. ఈ విషయాన్ని శ్రద్ధ ట్విటర్ ద్వారా వెల్లడిస్తూ.. ‘అజిత్ చిత్రంలో నేను నటించబోతున్నానని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అవి నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అద్భుతమైన సినిమాలో నేనూ భాగమయ్యాను. చాలా మంది దీని గురించి గతంలో నన్ను అడిగారు. కానీ నిర్ధారణ అయ్యాక చెబుదామని మౌనంగా ఉన్నాను. అలా ఉండటం చాలా కష్టమనిపించింది. ఇప్పుడు గర్వంగా ప్రకటిస్తున్నాను. ఇప్పటివరకు నేను నటించని ఛాలెంజింగ్ పాత్ర ఈ సినిమా ద్వారా నాకు దక్కిందని నమ్మకంగా చెప్పగలను. ఓపక్క ఎగ్జైటింగ్గా ఉన్నా మరోపక్క కంగారుగా కూడా ఉంది. ఇది అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా’ అని వెల్లడించారు.