హోసూరు : తమిళనాడు-ఆంద్ర ప్రదేశ్ సరిహద్దు తిరుపత్తూరు జిల్లా వానియంబాడి ఆటవీ ప్రాంతంలోని నెక్కానమలై. ఈ గ్రామంలో సుమారు అయిదు వందల కుటుంబాలున్నాయి. వ్యవసాయమే జీవనాధారం. గ్రామంలో మౌలిక వసతులు కరువే అనిచెప్పాలి. ద ట్టమైన అటవీప్రాంతంలో గ్రామం ఉన్నందున నెక్కానమలై గ్రామాన్ని ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదు. గ్రామ ప్రజలు ఆస్పత్రికి వెళ్లాలంటే 15 కి.మీ. దూరం దట్టమైన అటవీ ప్రాంతాల్లో కాలినడకన వానియంబాడికి చేరుకోవాలి. తమ గ్రామానికి కనీసం మట్టి రోడ్డునైనా నిర్మించి ఇవ్వాలని నెక్కానమలై గ్రామ ప్రజలు
పలు ప్రభుత్వాల వద్ద మొరపెట్టుకున్నాఅరణ్య రోదనగా మిగిలిపోయింది. వారి కల 73 ఏళ్ల తరువాత నెరవేరింది. వైద్యం, విద్య, మౌలిక వసతులకు దూరమైన గ్రామానికి ఎనిమిది కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న నెక్కానమలై గ్రామానికి రోడ్డు పనులను ప్రారంభించి పూర్తి చేశారు. మంత్రి కె.సి.
వీరమణి, కార్మిక సంక్షేమ శాఖ మంత్రి నీలోపర్, తిరుపత్తూరు ఎస్పీ విజయకుమార్ నెక్కానమలై గ్రామానికి వెళ్లి ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మంత్రులకు హారతి పట్టి మేళతాళాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ 73 ఏళ్ల కల నెరవేర్చిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నెక్కానమలై గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడంతో ఎన్నోవిధాలుగా నష్టపోయామని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకమీదట తమ గ్రామం అభివృద్ధి చెందుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.