విజయవాడ: ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో కౌలు రైతులే అధికంగా ఉన్నందున వారికీ పెట్టుబడి సాయంగా ఈ ఏడాది నుంచే రూ.25 వేలు వితరణ చేయాలని, అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా వర్తింప చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. శనివారం విజయవాడ ఎంబీ భవన్లో జరిగిన కౌలు రైతుల రాష్ట్ర సదస్సులో ఆయన ప్రసంగించారు.కౌలు రైతులకు వచ్చే ఏడాది నుంచి పెట్టుబడి సాయం చేస్తామని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది కౌలు రైతులు ఉండగా కనీసం 3 లక్షల మందికి కూడా ప్రభుత్వ సాయం అందటం లేదని విమర్శించారు. భూ యజమానులకే ప్రభుత్వ సాయం అందుతోందని, నిజమైన పేద కౌలు రైతులకు సాయం అందకపోవటం వల్లే ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామ కృష్ణ ఆక్రోశించారు. ఎన్నికల వేళల్లోనే ప్రభుత్వానికి రైతులు గుర్తుకు వస్తారని మండిపడ్డారు. వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామీనాథన్ సమితి రైతుల్ని ఆదుకునేందుకు చేసిన సిఫార్సుల్ని పాలకులు అంగీకరించినప్పటికీ అమలు చేయకుండా మొండి చేయి చూపారని దుయ్యబట్టారు. ‘పది సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ రైతులకు ఏమీ చేయ లూదు. లేదన్నారు. ఇక రైతుల ఆత్మహత్యలు ఉండవని భరోసా ఇచ్చిన నరేంద్ర మోదీ కూడా మాట నిలబెట్టుకోలేదు. తమ ఇబ్బందులను చెప్పేందుకు ఢిల్లీలో నిరాహార దీక్షలు చేసిన రైతుల్ని లాఠీలతో కొట్టించారని మండి పడ్డారు.