ఢిల్లీ : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ ఆరోరాను ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఢిల్లీ కలిశారు. చంద్రగిరి నియోజకవర్గంలోని అయిదు చోట్ల రీపోలింగ్కు ఆదేశించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తెదేపా ఫిర్యాదులను పట్టించుకోకుండా, వైకాపా ఫిర్యాదులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారని నిష్టూరమాడారు. మరో వైపు అమరావతిలోని సచివాలయంలో తెదేపా నేతలు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంను కలిశారు. నరసరావుపేట, రాజంపేట, రైల్వే కోడూరు, సత్యవేడు, జమ్మలమడుగు, సత్తెనపల్లి, చంద్రగిరి నియోజకవర్గాల్లోని 19 చోట్ల రీపోలింగ్ జరపాలని వారు డిమాండ్ చేశారు.
చంద్రగిరిలో అక్రమాలు నిజమే…
చిత్తూరు జిల్లా చంద్రగిరి శాసన సభ నియోజకవర్గంలోని అయిదు చోట్ల అక్రమాలు చోటు చేసుకోవడంతో అక్కడ రీపోలింగ్కు ఆదేశించామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలు జరిగినట్లు బలమైన సాక్ష్యాలు ఉన్నాయని, వీడియోలు చూస్తే ప్రజాస్వామ్యంలో ఇలా కూడా జరుగుతుందా…అని అనిపిస్తుందని అన్నారు. వీడియో సాక్ష్యాలు బలంగా ఉన్నందునే రీపోలింగ్కు ఆదేశించామన్నారు. ఎన్నికలను సక్రమంగా నిర్వహించని అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చంద్రగిరిలో అక్రమాల గురించి ఆలస్యంగా తెలియడంతో ఆదివారం రీపోలింగ్కు ఆదేశించామని ఆయన వెల్లడించారు.