ముంబై : దేశంలో తొమ్మిది వాణిజ్య బ్యాంకులను మూసివేయబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్నవన్నీ ఊహాగానాలేనని ఆర్బీఐ స్పష్టం చేసింది. తొమ్మిది బ్యాంకులను శాశ్వతంగా మూసివేయాలని కేంద్ర చూస్తోందని, తక్షణమే ఖాతాదారులు తమ నగదును ఉపసంహరించుకోవాలనే ఒక సందేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ దీనిపై స్పందిస్తూ, ఏ ప్రభుత్వరంగ బ్యాంకునూ మూసివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సందేశం కొంటె చేష్టగా అభివర్ణించారు. బ్యాంకులకు మూలధనం సమకూర్చి, మరింతగా బలోపేతం చేసే పనిలో ప్రభుత్వం ఉందని చెప్పారు. కాగా పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార బ్యాంకుపై ఆరు నెలల పాటు కొన్ని పరిమితులు విధిస్తూ మంగళవారం ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ బ్యాంకు ఖాతాదారులు ఆరు నెలల పాటు రోజుకు రూ.వెయ్యికి మించి నగదు ఉపసంహరించుకోవడానికి వీలు లేకుండా పోయింది. మరుసటి రోజే సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి ఊహాగానాలు వచ్చాయి.