మెల్బోర్న్: ఎప్పుడో ఒకసారి సచిన్ తెందుల్కర్ కోప్పడటం చూశాను గానీ ఎంఎస్ ధోనీని మాత్రం చూడలేదని టీమిండియా కోచ్ రవిశాస్త్రి అన్నాడు. అతనిలాంటి వాళ్లు 30, 40 ఏళ్లకు ఒకసారి కనిపిస్తారని పేర్కొన్నాడు. ధోనీ స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేదని వెల్లడించారు. ఆస్ట్రేలియా సిరీస్లో అతడు వరుసగా 51, 55, 87 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ‘అతనో దిగ్గజం. గొప్ప క్రికెటర్ల జాబితాలో నిలిచిపోతాడు. సచిన్ తెందుల్కర్ కోప్పడటం చూశాను. ధోనీని మాత్రం చూడలేదు. ఇలాంటి ఆటగాళ్లు 30, 40 సంవత్సరాలకు ఒకరు కనిపిస్తారు. క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత ఆ లోటు పూడ్చడం ఎంతో కష్టం. పంత్ మరో ధోనీగా అవతరిస్తే చాలా బాగుంటుంది. అతడిలో గొప్ప ప్రతిభ దాగుంది. రోజు అతడు మహీతో మాట్లాడతాడు. టెస్టు సిరీస్ సమయంలో ధోనీ కన్నా ఎక్కువగా ఎవరితో మాట్లాడలేదు. ఆటను ధోనీ జాగ్రత్తగా గమనిస్తాడు. వ్యూహాలు పన్నుతాడు. పదేళ్లు అతడు జట్టుకు నాయకత్వం వహించాడు. డ్రెస్సింగ్ రూమ్లో అతడికి ఎంతో గౌరవం లభిస్తుంది. ఓడినా, గెలిచినా, డకౌటైనా శతకం చేసిన మహీ ఎప్పుడూ ఒకేలా ఉంటాడు. అతడి దేహ భాషలో మార్పుండదు. 2011 నుంచి అతనొక్క ఇంటర్వ్యూ సైతం ఇవ్వలేదంటేనే అద్భుతం’ అని రవిశాస్త్రి అన్నాడు.