హిసార్ : ఉద్యమం విస్తరణలో భాగంగా కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్ర రైతుల మద్దతు కూడగడతానని భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ టికాయిత్ ప్రకటిం చారు.శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. త్వరలోనే ఆ రాష్ట్రాల్లో పర్యటిస్తానని వెల్లడించారు. ప్రస్తుతం పంజాబ్, హరియాణా, గుజరాత్, రాజస్థాన్ రైతులు నిరసనలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ‘గత 70 ఏళ్లుగా రైతులు వ్యవసాయంలో నష్టపోతూనే ఉన్నారు. ఇప్పుడు ఓ పంటను త్యాగం చేయాలి. అందుకు వారు సిద్ధంగా ఉన్నారు. పంటకోతకు కూలీలను నియమించుకుంటారే కానీ ఉద్యమం నుంచి నిష్క్రమించరు’అని తేల్చి చెప్పారు. బెంగాల్ ఎన్నికల గురించి తమకు ఎలాంటి ఆలోచన లేదన్నారు. ఖాప్స్ సంఘంతో కేంద్ర మంత్రి అమిత్ షా భేటీపై విమర్శలు చేశారు. ఆ వర్గానికి చెందిన ఎందరో రైతులు తమ ఉద్యమంలో పాల్గొంటున్నారని అన్నారు. హరియాణాలోని స్థానిక ఎన్నికలపై స్పందిస్తూ ఎలక్షన్లు క్రమబద్ధంగా జరగాలని పేర్కొన్నారు. నాయకులను ఎన్నుకోవడం ప్రజల ఇష్టం అని అన్నారు.