76 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా

76 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా

న్యూ ఢిల్లీ : రాజస్థాన్ రాజకీయం రసకందాయంలో పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సచిన్ పైలట్ను ఎంపిక చేయకూడదంటూ సీఎం అశోక్ గహ్లోత్ మద్దతుదారులైన 76 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కు రాజీనామా పత్రాన్ని అందించారు. రాజీనామాపై స్పీకర్ కార్యాలయం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆదివారం 90 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిసినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతానికి 76 మందే రాజీనామా చేశారు. సచిన్ పైలట్ను సీఎంగా నియమిస్తే తాము ఆమోదించే ప్రసక్తే లేదని వారు తేల్చి చెప్పారు. 2020లో రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తికి అధికారం అప్పజెప్పకూడదని స్పష్టం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై అధిష్ఠానం ఆగ్రహంగా ఉండటంతో కొందరు ఎమ్మెల్యేలు రాజీనామాపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై అధిష్ఠానం చర్యలు తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారంలో ముందుండి నడిపించిన ఎమ్మెల్యేలపై ప్రధానంగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అబ్జర్వర్లు మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్ చేసిన బుజ్జగింపు ప్రయత్నాలు సఫలం కాలేదు. ఆదివారం ముఖ్యమంత్రి నివాసంలో సీఎల్పీ భేటీకి గహ్లోత్ మద్దతుదారులు హాజరు కాలేదని సమాచారం. పైలట్ సహా ఆయన వర్గం ఎమ్మెల్యేలు భేటీకి హాజరయ్యారు. అందరు ఎమ్మెల్యేలు రానందున సమావేశం రద్దైంది. గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా కలిసేందుకూ ఖర్గే, మాకెన్ ఆదివారం మంత్రులు శాంతి ధరివాల్, ప్రతాప్ సింగ్ ఖచారియావాస్, మహేశ్ జోషి, ముఖ్యమంత్రి సలహాదారుడు సన్యం లోధాతో భేటీ అయ్యారు. అయినప్పటికీ రాజీనామాపై సందిగ్ధం వీడలేదు. ఎమ్మెల్యేలకు సమస్య ఉంటే వ్యక్తిగతంగా అయినా వచ్చి తమను కలవాలని మాకెన్ కోరారు. ఎమ్మెల్యేలు మూడు డిమాండ్లు అధిష్ఠానం ముందుంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యే వరకు రాజస్థాన్ తర్వాతి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకోకూడదని, కొత్త సీఎం ఎంపికపై గహ్లోత్ అభిప్రాయానికి విలువ ఇవ్వాలని కోరినట్లు వివరించాయి. గహ్లోత్ వర్గానికి చెందిన 102 మంది ఎమ్మెల్యేల నుంచే సీఎంను ఎంపిక చేయాలని డిమాండ్ చేశాయి. “మేం రాజీనామా చేసి ఇంటికి వెళ్తున్నాం. కొత్త సీఎంపై విషయంలో ఏ నిర్ణయమైనా పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక తర్వాతే తీసుకోవాలని ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు” అని మంత్రి గోవింద్ రామ్ మేఘవాల్ తెలిపారు. ‘ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా సరే’ అని స్వతంత్ర ఎమ్మెల్యే బాబులాల్ నగర్ పేర్కొన్నారు. కాగా, ఈ డిమాండ్లను పార్టీ అధినేత్రి సోనియాకు చేరవేస్తామని అజయ్ మాకెన్ స్పష్టం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos