న్యూ ఢిల్లీ : దేశమంతటా భానుడు భగ్గుమంటున్నాడు. ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెల మొదట్లోనే పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటిపోయాయి. దాంతో జనం ఇళ్ల నుంచి కాలు బయటపెట్టాలంటేనే జంకుతున్నారు. అత్యవసర పనులుంటే తప్ప బయటికి రావడంలేదు. ఈ క్రమంలో తమిళనాడులో వరుణుడు కరుణించాడు. మండుతున్న ఎండల నుంచి అక్కడి ప్రజలకు ఉపశమనం కలిగించాడు. ఇవాళ తమిళనాడులోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. మొత్తం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. మరో 48 గంటలపాటు రాష్ట్రంలో వాతావరణం చల్లగానే ఉండే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. రాజధాని చెన్నైలో కూడా రెండురోజులపాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలను దాటకపోవచ్చని అంచనా వేసింది. నాగ పట్టినం, మైలదుతురై, తిరువూర్, తంజావూరు, కన్నియకుమారి, తిరునల్వేలి, రామచంద్ర పురం, పుదుకొట్టై, శివగంగై, అరియూర్, కడలూర్, తూత్తుకూడి, తెంకాసి ప్రాంతాల్లో ఇవాళ వర్షాలు కురిశాయి.