ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని రాహుల్ గాంధీ పట్టుదలతో ఉన్నారు. తమ కుటుంబం నుంచి కాకుండా వేరెవరికైనా అధ్యక్ష బాధ్యత అప్పగించాలని ఆయన నిర్ణయించినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది. అధ్యక్ష పదవిలో ఆయనే కొనసాగాలని పార్టీ నాయకులతో పాటు శ్రేణులు గట్టిగా కోరుతున్నారు. ఇందులో భాగంగా పలువురు నాయకులు రాహుల్ను బుజ్జగిస్తున్నారు. మంగళవారం రాహుల్ నివాసం కాంగ్రెస్ నాయకులతో సందడిగా మారింది. వందల సంఖ్యలో నాయకులు రాహుల్ ఇంటి వద్ద గుమికూడారు. ఆయన సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలాలు కూడా వచ్చారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ కూడా రాహుల్ నివాసానికి చేరుకున్నారు. దీంతో అక్కడేం జరుగుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.