ఆర్​ఎస్​ఎస్ ను వ్యతిరేకించడమే నా పని .. దాడి చేసినా ఏ మాత్రం తగ్గబోను

న్యూ ఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు.శుక్ర వారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘ ప్రజాస్వామ్యం మరణాన్ని మనం చూస్తున్నాం. శతాబ్దకాలంపాటు ఇటుక ఇటుక పోగేసి నిర్మించిన భారత దేశం మన కళ్ల ముందే ధ్వంసమైపోతోంది. నియంతృత్వానికి ఎదురు నిలిచినవారిపై దాడులు చేస్తున్నారు, జైల్లో వేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, కొడుతున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, హింస.. ఇలా ప్రజాసమస్యలేవీ ప్రస్తావించరాదన్నదే వారి ఆలోచన. నలుగురు, ఐదుగురు ప్రయోజనాల కోసమే ఈ ప్రభుత్వం పని చేస్తోంది. ఇద్దరు, ముగ్గురు బడా వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసం ఇద్దరు వ్యక్తులు నియంత పాలన సాగిస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతల్ని ఎంతైనా ప్రశ్నించుకోవచ్చు. అసలు అక్కడ(హెరాల్డ్ కేసులో) ఏమీ లేదన్న విషయం అందరికీ తెలుసు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించడమే నా పని. అందుకు ప్రతిగా నాపై దాడి చేసినా ఏమాత్రం తగ్గబోను. వారు గాంధీ కుటుంబంపై ఎందుకు దాడి చేస్తారు? ఎందుకంటే.. మేము ఒక సిద్ధాంతం కోసం పోరాడతాం కాబట్టి. మాలాంటి వారు కోట్ల మంది ఉన్నారు. మేము ప్రజాస్వామ్యం కోసం, సమాజంలో సామరస్యం కోసం పోరాడతాం. ఎన్నో ఏళ్లుగా ఇలానే చేస్తున్నాం. మా కుటుంబం ప్రాణత్యాగాలు చేసింది. ఈ సిద్ధాంతం కోసం పోరాడేటప్పుడు అది మా బాధ్యత కూడా. రెండు వర్గాల మధ్య గొడవలు పెడు తుంటే, దళితుల్ని చంపేస్తుంటే, మహిళల్ని కొడుతుంటే చాలా బాధ కలుగుతుంది. అందుకే మేము పోరాడతాం. ఇది ఒక కుటుంబం కాదు.. ఒక సిద్ధాంతం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు దేశ ఆర్థిక రంగంలో అసలు ఏం జరుగుతుందో ఆమెకు తెలియడం లేదు. ఆమె రాజకీయ పార్టీకి అధికార ప్రతినిధిగా మాత్రమే ఉన్నారు. హిట్లర్ కూడా ఎన్నికల్లో గెలిచేవాడు. ఎలా గెలిచాడు? జర్మనీలోని వ్యవస్థలన్నీ అతడి నియంత్రణలోనే ఉండేవి. నాకు వ్యవస్థ మొత్తాన్ని అప్పగించండి. ఎన్నికలు ఎలా గెలవాలో నేను చూపిస్తా” అని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos