న్యూఢిల్లీ :ప్రధాని నరేంద్ర మోదీ అసమర్థ పాలన వల్లే చైనా దూకుడుగా ప్రవర్తిస్తోందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్ర వారం చేసిన ట్వీట్లో దుయ్యబట్టారు. దీనికి వీడియోనూ జత పరిచారు.‘2014 నుంచి ప్రధాని మోదీ చేస్తున్న నిరంతర తప్పులు, అవివేక చర్యలు భారత దేశాన్ని మూలాల నుంచి బలహీన పరుస్తున్నాయి, మనల్ని బలహీనులుగా మార్చాయి. భౌగోళిక రాజకీయాల ప్రపంచంలో ఉత్తి మాటలు సరిపోవు’అని దుయ్యబట్టారు. ‘ఆరు సంవత్సరాల నుంచి భారత దేశం కల్లోలంలో ఉంది. సమస్యలతో సత మత మైంది. దీనికి కారణాలు ఆర్థిక వ్యవస్థ, విదేశీ సంబంధాలు వంటి రంగాల్లో విఫలమవడమే. ఈ పరిస్థితులే దూకుడుగా వ్యవహరించేలా చైనాను ప్రోత్సహించాయని’ వీడియోలో వ్యాఖ్యానించారు.