న్యూఢిల్లీ : త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న పుదుచ్చేరిలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. నెలరోజుల వ్యవధిలో ఆ పార్టీకి చెందిన నలుగురు విధానసభ సభ్యులు రాజీనామా చేయటంతో దిగువ సభలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను కోల్పోయింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి పార్టీ నేతలతో చర్చించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ బుధవారం పుదుచ్చేరికి రానున్న దశలో వీరు రాజీనామాలు చేయడం గమనార్హం. నమశివాయం, తీప్పయింజన్ అనే ఇద్దరు ఎమ్మెల్యేలు జనవరి 25న, ఇటీవల మల్లాది కృష్ణారావు, మంగళవారం జాన్ కుమార్ రాజీనామా చేసారు. 33 స్థానాలున్న పుదుచ్చేరి శాసనసభలో మూడు నామినేటెడ్ స్థానాలు. 2016లో 30 స్థానాలకు ఎన్నికలు నిర్వహించినపుడు కాంగ్రెస్ పార్టీ 15 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు నలుగురు రాజీనామా చేయడంతో ఆ పార్టీ బలం 11కి పడిపోయింది.