పీకే …దండగ అని వదిలేశాం

పీకే …దండగ అని వదిలేశాం

న్యూ ఢిల్లీ: ‘ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొన్నాళ్ల కిందట కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిఉంది. కానీ, అది ఫలించలేద’ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ‘ఆయన పార్టీకి దూరమవడానికి కొంత ఆయన కారణం, కొంత మేమూ కారణం. ఆ కారణాలేంటన్నది ఇప్పుడు నేను చెప్ప లేను. చాలా విషయాల్లో ఏకాభిప్రాయం కుదర్లేదు. వాటి మీద చర్చించి దండగని ఇక వదిలేశాం. బయటి వ్యక్తిని తీసుకుంటుండడంపై పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమైంద’న్న వాదనలను కొట్టిపారేశారు. తానే యూపీ సీఎం అభ్యర్థినంటూ చేసిన వ్యాఖ్యలపైనా వివరణ ఇచ్చారు. జోక్ చేశానని చెప్పారు. ప్రతిసారీ అదే ప్రశ్న అడుగుతుంటే ఏం చెప్ప మంటారంటూ వ్యాఖ్యానించారు. ‘‘నేనే కాంగ్రెస్ యూపీ ప్రధాన కార్యదర్శిని. ఆయనే సీఎం క్యాండిడేట్.. ఈమే మా అభ్యర్థి అని చెప్పాలా? అది జరగని పని’’ అని ఆమె స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తారా? అని అడిగితే ‘‘నా మొహాన్ని అన్ని చోట్లా చూస్తుంటారు. కాదంటారా?’’ అని ఆమె బదులిచ్చారు. బహుశా పోటీ చేస్తానేమోనంటూ నర్మగర్భంగా సమాధానమిచ్చారు. తాను పోటీ చేసేదీ లేనిదీ టైం వచ్చినప్పుడు చెబుతానన్నారు. తానే యూపీ సీఎం అభ్యర్థినని అనుకోవడం సరికాదని చెప్పారు. తాను యూపీకి పార్టీ జనరల్ సెక్రటరీనని, కాబట్టి యూపీ బాధ్యత మొత్తం తనదేనని చెప్పుకొచ్చారు. నిరుడు ఏడాది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో పీకే అనేకమార్లు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. 2017 యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పీకే వ్యూహకర్తగా పని చేసిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఘోర పరాభవం తప్ప లేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos