దిల్లీ: అమెరికా, చైనాల వాణిజ్య సంబంధాల్లో అనిశ్చితి కొనసాగుతుండడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా కూడా చమురు ధరలు పెరిగాయి. ఈరోజు దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు 19 నుంచి 32 పైసల మధ్య పెరిగాయి. దేశ రాజధాని దిల్లీ నగరంలో లీటరు పెట్రోల్ ధర 19పైసలు పెరిగి రూ.69.07కు చేరింది. లీటరు డీజిల్ ధర 28పైసలు పెరిగి రూ.62.81గా ఉంది.
ముంబయిలో ఇవాళ పెట్రోల్ ధర 19పైసలు పెరిగింది. దీంతో లీటరు పెట్రోల్ రూ.74.72కు చేరింది. డీజిల్ లీటరుకు 30పైసలు పెరిగి రూ.65.73గా ఉంది. అలాగే చెన్నైలో పెట్రోల్ ధర రూ.71.67కు, లీటరు డీజిల్ ధర రూ.66.31కు చేరాయి. కోల్కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.71.20కు చేరగా, లీటరు డీజిల్ ధర రూ.64.58గా ఉంది.