ఎన్నికల వ్యూహకర్త,జేడీయూ బహిష్కృత నేత ప్రశాంత్ కిశోర్ మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ నేతృత్వంలోని జేడీఎస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.ఎన్డీఏలో మిత్రపక్షమైన జేడీయూ పార్టీ అధినేత నితీశ్కుమార్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో ప్రశాంత్ కిశోర్ను పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పౌరసత్వ సవరణ చట్టానికి నితీశ్కుమార్ మద్దతు తెలపడాన్ని తప్పుబడుతూ ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు చేయడంతో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యాడు.ఈ నేపథ్యంలో త్వరలో జేడీఎస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.2018లో జరిగిన కర్ణాటక ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిశోర్ సలహాలు తీసుకుందామని జేడీఎస్ నేతలు ప్రతిపాదించినప్పటికీ, కుమారస్వామి మాత్రం అంగీకరించలేదని సమాచారం. తాజాగా జేడీయూ నుంచి సస్పెండ్ కావడంతో జేడీఎస్ వైపు ప్రశాంత్ కిశోర్ దృష్టి సారించినట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే కుమారస్వామిని కలిసి ఈ విషయమై చర్చించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఈ విషయం చర్చనీయాంశం కాగా, ఈ విషయమై అటు దేవెగౌడ కానీ ఇటు కుమారస్వామి కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు.కాగా గత ఏడాది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ వైసీపీ పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన విషయం తెలిసిందే..