ఈనెల30వ తేదీ ఇంగ్లండ్ వేదికగా ప్రారంభం కానున్న ప్రపంచ కప్లో పాల్గొనేందుకు బీసీసీఐ ఎంపిక చేసిన 15 మంది ఆటగాళ్ల జాబితాలో హైదరాబాద్ క్రికెటర్ అంబటి రాయుడుకు చోటు దక్కకపోవడంపై బీసీసీఐ,సెలెక్టర్లపై విమర్శలు రోజురోజుకు తీవ్రతరమవుతున్నాయి.ఇప్పటికే గౌతమ్ గంభీర్ సహా పలువురు అంబటిరాయుడుకు మద్దతుగా సెలెక్టర్లు,బీసీసీఐపై విమర్శలు చేయగా తాజాగా హైదరాబాద్ క్రీకెటర్ ప్రజ్ఞాన ఓజా కూడా అంబటి రాయుడుకు మద్దతుగా చేసిన ట్వీట్ చర్చనీంశాయమైంది.ట్విట్టర్లో “హైదరాబాద్ క్రికెటర్లలో కొందరి పరిస్థితి ఇంతే. ఇలాంటి పరిస్థితులను నేను ఎదుర్కున్నా. ఇది అందరూ అర్థం చేసుకోవాల్సిన అంశం” అని రాయుడికి మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశాడు.కాగా జట్టు ఎంపికపై ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ.. నాలుగవ స్థానంలో ఆడడానికి అంబటి రాయుడు,విజయ్ శంకర్కు పలు అవకాశాలు ఇచ్చామని అందులో శంకర్ అయితే మూడు విధాలుగా(త్రీ డైమెన్షన్స్)గా ఉపయోగపడతాడంటూ తెలిపాడు.దీంతో ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యలపై నేరుగా ఎటువంటి వ్యాఖ్యలు చేయని రాయుడు “ఇప్పుడే 3d గ్లాసెస్ కోసం ఆర్డర్ చేశా. వచ్చే ప్రపంచకప్ను 3 D గ్లాసెస్తోనే చూస్తా”అంటూ వ్యంగ్యంగా స్పందించాడు.ఈ ట్వీట్పై బీసీసీఐ స్పందిస్తూ రాయుడి బాధను అర్థం చేసుకోగలమని, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోమని స్పష్టం చేసింది. దీంతోపాటు అంబటి రాయుడు, రిషబ్ పంత్లను స్టాండ్ బై ఆటగాళ్లుగా ఎంపిక చేస్తూ బీసీసీఐ అ మరుసటి రోజు ప్రకటన విడుదల చేసింది..