కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వచ్చాక దేశంలో పోలీసుల జరిమానాలు మితిమీరుతున్నాయంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.కొద్ది రోజుల క్రితం ఎద్దులబండికి జరిమానా విధించిన పోలీసులు తాజాగా తమిళనాడులో ఓ సైక్లిస్టుకు జరిమానా విధించడం చర్చనీయాంశమైంది. తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా పెన్నాగరం మండలం ఏరియా పోలీసు స్టేషన్ పరిధిలో ప్రత్యేక అసిస్టెంట్ పోలీసు కమిషనర్ సుబ్రమణి నేతృత్వంలో పోలీసులు మంగళవారం వాహనాల తనిఖీ చేశారు.రోడ్డు,ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నారు.అదే సమయంలో ఓ పాఠశాల విద్యార్థి సైకిల్ తొక్కుకుంటూ వస్తుండగా విద్యార్థిని ఆపిన కానిస్టేబుల్ జరిమానా చెల్లించాలంటూ విద్యార్థికి తెలిపాడు.అయితే జరిమానా ఎందుకు చెల్లించాలని ప్రశ్నించగా శిరస్త్రాణం లేకపోవడంతో జరిమానా విధించినట్లు సమాధానమివ్వడంతో బిత్తరపోయిన విద్యార్థి తల్లిదండ్రులకు సమాచార మిచ్చాడు. అనంతరం గంటపాటు రోడ్డుపైనే నిలబెట్టి, సైకిల్ని, విద్యార్థిని విడిచిపెట్టారు.అక్కడే ఉన్న కొంతమంది ఈ తతంగాన్ని వీడియో తీసి విషయం సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడంతో వైరల్గా మారింది.దీంతో ఆ విద్యార్ధి రెండు చేతులతో హ్యాండిల్ వదిలేసి సైకిల్ తొక్కు కుంటూ రావడాన్ని గమనించి హెచ్చరించేందుకు అడ్డుకున్నట్లు చెబుతూ పోలీసుల వర్గాలు తమ నిర్వాకాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.