ఢిల్లీ : పర్యావరణ అనుమతులను యథేచ్ఛగా ఉల్లంఘించారనే ఆరోపణపై పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పర్యావరణ అనుమతులను ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని ప్రశ్నించింది. పోలవరంతో పాటు దాని అనుబంధ ప్రాజెక్టులపై చెన్నైలోని బ్రాంచి కార్యాలయం ద్వారా తనిఖీలు జరిపించిన కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు, తదనంతరం కేంద్రానికి నివేదిక అందజేశారు. పరిధికి మించి పర్యావరణ అనుమతులను ఉల్లంఘించారని నివేదికలో పేర్కొన్నారు. ఈ ఉల్లంఘనపై గత నెల 22న జాతీయ హరిత ట్రైబ్యునల్లో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు నోటీసులు కూడా జారీ చేసినట్లు అధికారులు అఫిడవిట్లో పేర్కొన్నారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టుపై కూడా కేంద్రం వివరణ కోరినట్లు తెలిసింది.